Breaking News

నేడు ప్రజా దర్బారంటూ ప్రచారం.. సీఎం జగన్ ఇంటి వద్ద తొక్కిసలాట!


తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో సీఎంకి ఆర్జీ ఇచ్చేందుకు వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన విశ్రాంతమ్మ అనే మహిళ స్పృహ తప్పి కిందిపడిపోయింది. జులై 1న ప్రారంభించి.. సీఎం ఫిర్యాదులు తీసుకుంటారనే ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారీ సంఖ్యలో జనం రావడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రిని కలవాలంటూ ఒక్కసారిగా ప్రజలు లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కు పంపారు. కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జులై 1 నుంచి నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్‌ ఆగస్టు 1కి వాయిదా పడింది. అయితే, ఆ విషయం తెలియని ప్రజలు సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చివరికి వాయిపడిన విషయం తెలుసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించి సత్వరమే పరిష్కారించాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌ను సీఎం జగన్ ప్రారంభించాలనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి మొదలుపెట్టాలని ఆయన భావించారు. అయితే దీనికి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాకపోవడం, అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసినట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. జూలై 1వ తేదీ నుంచి ప్రజాదర్బార్‌ జరుగుతుందని మీడియాలో ప్రచారం సాగుతోందని, అది సరికాదని అన్నారు. శాసనసభ సమావేశాలు మొదలైతే ముఖ్యమంత్రి రోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రజలను కలుసుకుని, విజ్ఞప్తులు స్వీకరించడం కష్టం అవుతుందని తెలిపారు. అలాగే, సీఎంని కలవవడానికి వచ్చే ప్రజల కోసం మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, అవన్నీ పూర్తయ్యాక ప్రజా దర్బార్‌ ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు.


By July 01, 2019 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/stampede-at-ap-cm-jaganmohan-reddy-residence-in-tadepalli/articleshow/70020736.cms

No comments