Breaking News

శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి


దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుప్రమాదం చిదిమేసింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా పట్టణంలోని ఎన్ఆర్‌టీ సెంటర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బువారిపాలెం గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన 11మంది ఫార్చునర్ వాహనంలో తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్‌టీ సెంటర్‌లో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చిలకలూరి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను వెంకట్ (30), సూర్య భవాని (22), మనోజ్ (22), గీతేశ్వరి బాబు (4), సోనాక్షి (5)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చీకటి సమయం కావడం, లారీ ఆగివున్నట్లు గమనించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవరు కారులోనే ఇరుక్కుపోవడంతో క్రేన్ సాయంతో బయటకు తీశారు. నరసరావుపేట డీఎస్పీ రామవర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సమాచారం వారి బంధువులకు చేరవేసినట్లు ఆయన చెప్పారు.


By July 01, 2019 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/car-hit-road-side-lorry-in-chilakaluripet-5-died-6-injured/articleshow/70017400.cms

No comments