Breaking News

నల్లమల సందర్శనకు రేపటి నుంచి 3 నెలలు బ్రేక్.. కారణం ఇదే!


తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం పర్యాటకంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నల్లమల సందర్శనకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. అయితే, నల్లమల సందర్శనను మూడు నెలలు నిలిపివేస్తున్నారు. పర్యాటకులను జులై 1 నుంచి అనుమతించమని అటవీ శాఖ తెలిపింది. దీంతో నల్లమల అందాలను ఆనందించాలనే పర్యాటకులకు అటవీ శాఖ నిర్ణయం కాస్తా నిరాశకు గురికాక తప్పదు. జంతువుల సంతానోత్పత్తికి ఇదే అనువైన సమయం కావడంతో వాటికి ఆటంకం కలగరాదన్న ఉద్దేశంతో అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి అందాలను తనివితీరా చూడాలంటే మరో మూడు నెలలు ఆగక తప్పదు. నాగర్‌కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెళ్లే మార్గంలోని నల్లమల అడవుల్లోని వివిధ ప్రదేశాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. దీంతో ఈ ప్రాంతాల సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు వస్తుంటారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో తరలివస్తారు. సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యాన్ని, అడవిలో సంచరించే జంతు సంతతిని చూసేందుకు వచ్చేవారి సంఖ్యా అధికంగా ఉంటుంది. వర్షాకాలం ఆరంభమే జంతువుల సంతాన ఉత్పత్తికి సమయం. అందుకే నిర్ణీతకాలంపాటు పర్యాటకులపై నిషేధం విధిస్తుంటారు. ఈ తరుణంలోనే జంతువులకు మనుషులు తారసపడితే దాడిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పులులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, కుక్కలు, ఇతర ప్రాణులకు కొందరు పర్యాటకుల వల్ల ముప్పు పొంచి ఉండటంతో ఈ నిషేధాజ్ఞలు అవసరమని అటవీ అధికారులు తెలిపారు. తాత్కాలిక నిషేధం 2017 ఆగస్టు నుంచి అమలుచేస్తున్నారు. నల్లమలలోని జంతు సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. వీటి రక్షణ కోసం సీసీ కెమెరాలు, నిఘా బృందాలు, రాత్రివేళలో గస్తీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. జంతువులు ఉనికిని తెలుసుకుంటూ వాటిని వృద్ధి చేసేందుకు భద్రతను పటిష్ఠం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పర్యటక ప్రాంతాలపై తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీచేశారు. ఈ ప్రాంతాల్లో ఎవరూ పర్యటించేందుకు వీలులేకుండా అనుమతులు నిలిపివేశారు. దట్టమైన నల్లమలలో కనువిందు చేసే ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌‌ను తిలకించేందుకు రోజూ పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరుకు 26 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అందమైన పచ్చికబయళ్లు, లోయలు, ఎత్తైన పర్వత శిఖరాలను ఇక్కడ నుంచి దగ్గరగా తిలకించవచ్చు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో అడవి జంతువులను కూడా అతిదగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. స్వయంగా జంతువులను చూడటం, అడవి అందాలను తిలకిచేందుకు సాధ్యపడటంతో రోజు భారీ సంఖ్యలో సందర్శకులు వస్తారు. మన్ననూరుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కమహాదేవి గుహలకు కూడా భక్తుల తాకిడి ఎక్కువే. ఈ రెండు ప్రాంతాలను సందర్శించేందుకు పర్యటలకు పెద్దఎత్తున తరలివస్తారు.


By July 01, 2019 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-forest-department-temporarily-banned-to-tourists-visits-in-nallamala-forest/articleshow/70017663.cms

No comments